ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు రానున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి బీజేపీ షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం ఉదయం తెలంగాణలో అడుగుపెట్టనున్నారు ప్రధాని మోడీ. సోమవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సోమవారం ఉదయం 11.15 గంటల నుంచి 12 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు ప్రధాని మోడీ. మార్చి 5న సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజ్భవన్ నుంచి మోడీ బయల్దేరతారు.
మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.15 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోడీ. 11.30 నుంచి 12.15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిశాకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. కాగా, రాష్ట్రంలో మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ మొత్తంలో పోలీసు బలగాలు మోహరించాయి. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి సహకరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.









