శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు, ఆఫీస్ ఫర్నిచర్ను ధ్వంసం చేసి, అద్దాలు పగలగొట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు, వెంటనే వైసీపీ కార్యాలయంపై దాడికి దిగడంతో హిందూపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఎవరో హైదరాబాద్లో ఉండే వాళ్ల కింద బతుకుతున్నాం. హిందూపురంలో 40 ఏళ్లుగా బానిసలుగా ఉన్నాం. అతడికి ఓట్లు వేస్తాం, అతడు ఎక్కడో కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవాలా? లేకపోతే ఎక్కడో ఉండే వ్యక్తుల కాళ్ల కింద బతకాలా? అన్నది మీరు ఆలోచించుకోండి,” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణను ఉద్దేశించి చేసినట్లుగా భావించిన టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందించాయి.
వేణుగోపాల్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు హిందూపురంలో రాజకీయ చిచ్చు రాజేశాయి. ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగి, వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు.









