UPDATES  

NEWS

 రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఆధికారి..!

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఒక విద్యుత్ శాఖ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

 

మహబూబాబాద్ సర్కిల్ పరిధిలోని తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్) ఆపరేషన్స్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీరుగా పనిచేస్తున్న జనగాం నరేష్, ఒక ఫిర్యాదుదారుని నుంచి లంచం డిమాండ్ చేశారు. కురవి మరియు మరిపెడ సబ్-డివిజన్లకు సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న అంగీకార పత్రాల ఒప్పందాలను యథాతథంగా కొనసాగించేందుకు అధికారికంగా సహకరించేందుకు గాను ఆయన మొత్తం రూ.1,00,000 లంచం అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

ఇందులో భాగంగా ఇప్పటికే రూ.20,000 ముడుపులు స్వీకరించిన నరేష్, మిగిలిన రూ.80,000 బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, నరేష్‌ను లంచం డబ్బులతో సహా అదుపులోకి తీసుకుంది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందుకోసం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), అధికారిక వెబ్‌సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |