UPDATES  

NEWS

 కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు..!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు.

 

ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక నాయకుడిని కించపరచడమే కాకుండా, రాజకీయాల్లో సున్నితమైన వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని బల్మూరి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి పరువుకు నష్టం కలిగించేలా ఈ పోస్టులు, వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.

 

ఈ నేపథ్యంలో, కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ పోలీసులను కోరారు. వారి వ్యాఖ్యలు, పోస్టులు సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |