UPDATES  

NEWS

 ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దొంగల చేతివాటం..! వలంటీర్ల ముసుగులో దోచుకున్నారు..!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI-171, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనతో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. విమానం నేరుగా ఇంటర్న్ డాక్టర్లు నివసిస్తున్న ఓ రెసిడెన్షియల్ హాస్టల్‌పై పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

 

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం రెక్క మేఘాని నగర్ సమీపంలోని బహుళ అంతస్తుల ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్ భవనంలోని మూడు, నాలుగు మరియు ఐదో అంతస్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీగామంటలు చెలరేగాయి. యాభై మందికి పైగా ఉంటున్న హాస్టల్ భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇందులో యువ వైద్య ఇంటర్న్‌లు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంటల తీవ్రతకు కొందరు లోపలే చిక్కుకుపోగా, మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు.

 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. “ఓ వ్యక్తి తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు” అని ఓ స్థానికుడు కన్నీటిపర్యంతమయ్యాడు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. భవనంలో మంటలు వ్యాపిస్తుండటంతో చాలా మంది కిటికీల నుంచి దూకడం కనిపించింది.

 

అధికారిక మృతుల సంఖ్య ఇంకా వెలువడనప్పటికీ, ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్‌పై ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ఎనిమిది నుంచి తొమ్మిది మందికి పైగా మరణించి ఉండవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

వలంటీర్ల ముసుగులో దోచుకున్నారు!

 

ఈ విషాద ఘటనలో మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, కొందరు వ్యక్తులు వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లోని సేఫ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులను దోచుకున్నారని అధికారులు తెలిపారు. నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన పట్ల పౌరులు, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |