UPDATES  

NEWS

 ‘కాళేశ్వరం’ మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలచిపోయేది: కేటీఆర్..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేవలం కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వ వైఖరిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టును ఒకవేళ మరో దేశంలో నిర్మించి ఉంటే, అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ మన దేశంలో కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఒక పావుగా మార్చుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రాజెక్టు నిర్మాణం అనేది ఏ ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. దీనిని ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది” అని కేటీఆర్ వివరించారు.

 

ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో దాచిపెట్టాల్సింది ఏమీ లేదని, అయినప్పటికీ అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కమిషన్ ముందు మాజీ మంత్రి హరీశ్ రావు అన్ని అంశాలను కూలంకషంగా వివరించారని, ఇక కేసీఆర్ కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదని కేటీఆర్ తెలిపారు.

 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్‌లో ఎవరూ భయపడరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |