UPDATES  

NEWS

 విద్యుత్ శాఖపై జగన్ ప్రభుత్వం రూ. 1.25 లక్షల కోట్ల అప్పు చేసింది: మంత్రి గొట్టిపాటి..

దేశ భద్రత విషయంలో ప్రజలందరూ ఏకతాటిపై నిలుస్తుంటే, రాష్ట్ర ప్రగతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఆసక్తి ఉండటం లేదని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ తన సొంత ప్రచార సాధనాల ద్వారా నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారని, అయితే ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీక్ అవర్స్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ. 9.38 చొప్పున కొనుగోలు చేశారని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అత్యవసర సమయాల్లో కూడా యూనిట్‌ను కేవలం రూ.4.60కే సమకూర్చుకుంటోందని ఆయన వివరించారు. జగన్ ప్రభుత్వం యూనిట్‌ను రూ.5.12కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, అయితే సెకీ (SECI) నుంచి రూ. 2.49కే కొనుగోలు చేసిందనడంలో వాస్తవం లేదని గొట్టిపాటి పేర్కొన్నారు.

 

“రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కుదుర్చుకున్న యాక్సిన్ రెన్యూవబుల్ ఎనర్జీ – బ్రూక్‌ఫీల్డ్‌ ఒప్పందం ద్వారా ప్రజలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది” అని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, యాక్సిన్-బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థ రైతుల నుంచి 1,700 ఎకరాల భూమిని లీజుకు తీసుకుంటుందని, ఎకరాకు రూ. 31 వేల చొప్పున లీజు చెల్లించేలా అంగీకారం కుదిరిందని ఆయన వెల్లడించారు. ప్రతి రెండేళ్లకు లీజు మొత్తాన్ని 5 శాతం పెంచేలా కూడా ఒప్పందంలో పొందుపరిచారని గొట్టిపాటి వివరించారు.

 

గత జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను రూ.1.25 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచిందని మంత్రి ఆరోపించారు. ఆ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలు ఇప్పటికీ మోయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |