UPDATES  

NEWS

 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్… ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ..

రాష్ట్రంలోని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డీఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆమె ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో, శామ్ ఇన్‌స్టిట్యూట్ వారు రూపొందించిన ‘ఆచార్య’ యాప్ ద్వారా ఈ శిక్షణను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

ఈ ఆన్‌లైన్ కోచింగ్ 24 గంటల పాటు అభ్యర్థులకు అందుబాటులో ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. అనేకమంది అభ్యర్థులు, ముఖ్యంగా గృహిణులు, సుదూర ప్రాంతాల్లో నివసించేవారు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు ఆఫ్ లైన్ కోచింగ్ కు హాజరుకాలేక ఇబ్బంది పడుతున్నారని, వారి విజ్ఞప్తి మేరకే ఈ ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా కోచింగ్ పొందే వీలు కల్పించినట్లు చెప్పారు.

 

శిక్షణ కాలంలో అర్హులైన అభ్యర్థులకు నెలకు రూ. 1500 చొప్పున ఉపకార వేతనం, పుస్తకాల కొనుగోలు నిమిత్తం అదనంగా మరో రూ. 1000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనలు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్, గత డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. శామ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఈ రంగంలో విస్తృతమైన అనుభవం ఉందని, అందుకే ఈ బాధ్యతను వారికి అప్పగించినట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |