UPDATES  

NEWS

 గుట్టు విప్పేసిన రాజ్ కసిరెడ్డి.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..!

వైసీపీ నేతలకు టెన్షన్ మొదలయ్యాయా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ చీకటి గుట్టుని రాజ్ కసిరెడ్డి బయటపెట్టేశాడా? అందులో పాలు పంచుకున్న నేతలు, అధికారులు, మాజీ అధికారుల్లో అప్పుడే భయం మొదలైందా? ఈ వ్యవహారంలో వైసీపీలో గ్యాంగ్‌వార్ మొదలైందా? కొందరికి రేపో మాపో సిట్ నోటీసులు జారీ చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

గుట్టు విప్పేసిన కసిరెడ్డి

 

వైసీపీలో కొందరి నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. లిక్కర్ స్కామ్‌లో కీలక నేతలు చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో సూత్రధారి ఎవరన్నది విజయసాయిరెడ్డి చెప్పకపోయినా? తాము కేవలం పాత్రదారులమని తేల్చేశారు రాజ్ కసిరెడ్డి. దీని వెనుక మూలాలు తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారాయన. దీంతో రేపు ఏం జరుగుతుందన్న భయం కొందర్ని వెంటాడుతోంది.

 

పార్టీకి ఫండ్ వచ్చేలా మద్యం పాలసీని రూపొందించాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారట రాజ్ కసిరెడ్డి. దాని ప్రకారమే చేశామని సిట్ విచారణలో లోగుట్టు విప్పేశాడు. ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టలరీల నుంచి ప్రతీ నెలా 50 నుంచి 60 కోట్ల రూపాయాలు వసూలు చేసినట్టు వివరించాడు. ఆ డబ్బులను జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ వ్యక్తులకు వెళ్లేవని బయటపెట్టారు.

 

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

 

కేవలం వసూలు చేయడం వరకు మాత్రమేనని, ఆ నిధులు పై వ్యక్తులకు ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు అధికారులు. లిక్కర్ పేరిట ముడుపుల వ్యవహారం 3,200 కోట్ల రూపాయలు తేలింది. కాకపోతే లక్ష కోట్ల రూపాయలని కూటమి సర్కార్ చెబుతోంది. ముడుపుల డబ్బులను బంగారు కొనుగోలు, షెల్ కంపెనీలు క్రియేట్ చేయడం, అలాగే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు.

 

లిక్కర్ ఉత్పత్తి, సరఫరా అంతా వాసుదేవరెడ్డి కనుసన్నల్లో జరిగిందని ప్రస్తావించారు. ఈ వ్యవహారం సజావుగా సాగాలంటే సాఫ్ట్‌వేర్ తొలగించి మాన్యువల్ పద్దతిలో నడిపించినట్టు తేలింది. కేవలం ముడుపులు ఇచ్చిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు వెళ్లేవని ప్రస్తావించారు. ఒకవిధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డిని ఆయన లాగేశారన్నమాట. ఈ కేసులో తొలుత సాక్షిగా విజయసాయిరెడ్డిని విచారించిన సిట్, ఆయనను ఏ-5గా చేర్చింది సిట్.

 

విజయసాయిరెడ్డి సైతం

 

ముడుపుల వ్యవహారమంతా హైదరాబాద్‌లోని విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగింది. ఆయా బ్రాండ్లు ఎంత మేరా సరఫరా చేయాలి? షాపులకు ఏ తరహా విక్రయించాలి? అనేది తాము తాము నిర్ణయించామని వెల్లడించారు నిందితుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు ఈ గ్యాంగ్ కన్నుసన్నల్లోనే సాగిందన్నమాట.

 

ఈ కేసు బయటకు రావడానికి విజయసాయిరెడ్డి ప్రధాన కారణం. ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి రాకుంటే ఈ వ్యవహరం బయటకు వచ్చేది కాదు. అంతేకాదు రాజ్ కసిరెడ్డి గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఈ భయంతో అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

 

ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్‌లో 29 మందిని నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. ఏ-1 కసిరెడ్డి కాగా, ఏ-4 మిథున్‌రెడ్డి. వీళ్లనితోపాటు కొందరు అధికారులు సైతం బుక్కయ్యారు. వీరందరినీ విచారిస్తే సూత్రదారి ఎవరన్నది బయటకు రావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా లిక్కర్ సెగ తాడేపల్లి ప్యాలెస్‌కు తగిలిందనే చెప్పాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |