కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదులు తుపాకులతో తెగబడ్డారు. పహెల్గామ్లో టూరిస్టులపై కాల్పులు జరిపారు. 27 మంది పర్యాటకులు మరణించారు. మరో 20 మంది టూరిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దాడి సమాచారం అందగానే జమ్ము కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వెంటనే కశ్మీర్ బయలుదేరారు.
టూరిజం స్పాట్లో ఫైరింగ్
హిల్ స్టేషన్ అయిన పహెల్గామ్లో ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి కాలినడకన గానీ, గుర్రాలపై మాత్రమే చేరుకునే ఛాన్స్ ఉంది. అలాంటి పర్యాటక కేంద్రంలో టెర్రరిస్టులు పక్కా ప్లాన్ చేసి టూరిస్టులపై కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఫైరింగ్ శబ్దం విని.. సమీపంలోని భద్రతా దళాలు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పర్యాటకులపై ఏడుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాడి చేసింది తామేనని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట
పహెల్గామ్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించింది ఆర్మీ. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ట్రెక్కింగ్ చేసే ప్రాంతం కావడంతో రోడ్డు సదుపాయం సరిగ్గా లేదు. కూంబింగ్ కోసం వెళ్లే భద్రతా బలగాలే టార్గెట్గా ట్రాప్లు ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు.
కేంద్రం హెచ్చరికలు జారీ
పర్యాటకులు, భక్తులు టార్గెట్గా కశ్మీర్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే హెచ్చరించింది. నిఘా వర్గాలు అనుమానించినట్టే ఇప్పుడు టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.
వెకేషన్ టైమ్లో టెర్రర్ అటాక్
భూతల స్వర్గంగా పేరుగాంచిన జమ్మూ కశ్మీర్కు సమ్మర్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం సీజన్ నడుస్తోంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇలాంటి పీక్ టైమ్ చూసి.. ఉగ్రవాదులు దాడులు చేశారంటే పక్కా ప్లాన్డ్ అని తెలుస్తోంది. పర్యాటకులను భయపెట్టి కశ్మీర్కు రాకుండా చేయడమే వారి టార్గెట్గా కనిపిస్తోంది.