నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణ సహా పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు సమాచారం.
త్వరలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉన్నందున.. వీటికి సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు నిర్మాణ పనులను దక్కించుకున్న ఏజెన్సీలకు అందజేయాల్సిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుండి 15,000 కోట్ల రూపాయల మేర రుణం ఇదివరకే మంజూరైంది. ఈ మొత్తం అక్కడి నిర్మాణాలకు ఊతం ఇవ్వనుంది.
సీఆర్డీఏ పరిధిలో మొత్తం 90 పనులను చేపట్టనున్నట్లు ఇదివరకే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే. వీటిలో మొదటి దశలో 73 పనులకు పరిపాలనపరమైన ఆమోదం లభించింది. ఫలితంగా- ఈ పనులు మొదలు కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం 24,274 కోట్ల రూపాయలు అవసరమౌతాయని అంచనా వేసింది.
మొత్తంగా 45, 249 కోట్ల పనులకు గతంలో సీఆర్డీఏ అనుమతులు ఇచ్చినట్టయింది. ఇందులో- అసెంబ్లీ భవనానికి రూ. 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు, అయిదు ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ వెల్లడించింది. అలాగే రహదారుల టెండర్ల కోసం మరో రూ.9,699 కోట్లు, ఇతర రోడ్లకు 7, 794 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని సమాచారం.
వీటితో పాటు సీఆర్డీఏ 45వ సమావేశంలో ఆమోదించిన పలు పనులను మంత్రివర్గం ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. జరీబు భూముల రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లకు సంబంధించి మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తోంది. హైకోర్టు, శాసనసభ భవనాలకు సంబంధించి టెండర్లు, 473 కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన అనుమతులు ఇవ్వనుంది.