ఆర్థిక నిందితుడు మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు బెల్జియంలో అతడిని అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మోసం చేసి వేల కోట్లు అప్పుగా తీసుకుని, ఇండియా నుంచి పరారయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు 65 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
చోక్సీని అరెస్ట్ చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించారు. అయితే, అనారోగ్యం, ఇతర కారణాలు చూపుతూ చోక్సీ బెయిల్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 13,500 కోట్ల రుణ మోసంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీని భారత్ కోరుతోంది. ఆయన తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసి ఆంట్వెర్ప్ నివసిస్తున్నాడు. ఆంటిగ్వా అండ్ బార్బడోస్ దేశ పౌరసత్వాన్ని కలిగి చోక్సీ, తన వైద్యం కోసం ఆ దేశాన్ని వదిలిపెట్టాడు.
ఈ కేసులో సహ నిందితుడైన ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ లండన్ నుంచి భారత్ రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పీఎన్బీలో జరిగిన కుంభకోణం బయటపడటానికి కొన్ని వారాల ముందు, జనవరి 2018లో భారత్ విడిచి పారిపోయారు.