UPDATES  

NEWS

 తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక .. నేడు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి..

నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నేడు నెరవేరుతోంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది.

 

గత ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, తాజాగా నిజామాబాద్‌‌లో ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజినల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

 

పసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. నాటి నిజామాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 176 మంది రైతులు నామినేషన్‌లు దాఖలు చేయడంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో పసుపు బోర్డు సమస్య జాతీయ స్థాయికి చేరింది. 2014 ఎన్నికల్లో లక్షా 60 వేలకుపైగా మెజార్టీతో ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత పసుపు రైతుల వ్యతిరేకత నేపథ్యంలో 2019 ఎన్నికల్లో 70 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

 

నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. రైతులకు సంక్రాంతి కానుకగా పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |