UPDATES  

NEWS

 ఇసుక పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పథకం అమల్లోకి తెచ్చిన తరువాత రవాణా ఛార్జీల పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీని పైన అద్యయనం చేసి ధరలు ఫిక్స్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు రవాణా ఛార్జీల పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించారు. దీంతో..తాజాగా ప్రభుత్వం రవాణా ధరలను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఛార్జీలు ఖరారు

ఉచిత ఇసుక పంపిణీలో రవాణా చార్జీలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా చార్జీలు ఒకే విధంగా ఉండేలా ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక సరఫరా చేసే స్టాక్‌ పాయింట్ల నుంచి డెలివరీ చేసేవరకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని ధ రలను నిర్ణయించారు. ట్రాక్టర్‌కు 4.5 టన్నులు, ఆరు టైర్ల లారీకి 10 టన్నులు, 10 నుంచి 14 టైర్ల లారీకి 18 నుంచి 35 టన్నుల వరకు కిలో మీటరుకు ఏ మేరకు ధర వసూలు చేయాలో ప్రభుత్వం ఈ జీఓలో నిర్దేశించింది. స్టాక్‌ పాయింట్‌ నుంచి పది కిలో మీటర్ల లోపుగా 4.5 టన్నుల ట్రాక్టర్‌కు కిలో మీటరుకు రూ.13.5 చొప్పున ధర వసూలు చేయాలని డిసైడ్ చేసారు.

 

ఆరు శ్లాబులు

ఇక ఆరు టైర్ల లారీకి 10 టన్నులకు గాను కిలోమీటరకు 10.7, 10-14 టైర్ల లారీకి 18 నుంచి 35 టన్నుల లారీకి 9.4 రూపాయల చొప్పున ధర డిసైడ్ చేసారు. 11 నుంచి 20 కి.మీ దూరంలో ఇసుక డెలివరీ చేయాలనుకుంటే, తొలి 10 కి.మీ వరకు ఆర్‌ 1 ధర, ఆ తర్వాత 11 వ కి.మీ నుంచి ఆర్‌ 2 ధర వర్తింపజేస్తారు. ఇలా కిలోమీటరు చొప్పున ధరలను ఖరారు చేశారు. రాష్ట్రమంతటా ఇవే ధరలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. తొలి పది కిలోమీటర్ల మేరకు కిలో మీటర్‌ చొప్పున ట్రాక్టర్‌/లారీకి రవాణా చార్జీని వసూలు చేస్తారు.

 

రాష్ట్రమంతా ఒకే విధంగా

ఆ తర్వాత 11-20 కి.మీ పైన తొలి పది కిలో మీటర్లకు ఆర్‌ 1 ధర, ఆ తర్వాత 11 నుంచి 20 కి.మీ వరకు అదనంగా ఆర్‌ 2 ధరలను వసూలు చేస్తారు. ఉదాహరణకు స్టాక్‌ పాయింట్‌ నుంచి 14 కి.మీ దూరంలో ట్రాక్టర్‌తో ఇసుక డెలివరీ చేయాలంటే తొలి 10 కిలో మీటర్లకు సగటున కిలో మీటర్‌కు రూ.13.5ల చార్జీ ఉంటుంది. ఆ తర్వాత 11వ కి.మీ నుంచి రూ. 12.8 చొప్పున ధర వసూలు చేస్తారు. ఆ పైన 4 కి.మీ దూరానికి రూ.12.8 చొప్పున రూ.51.2 చార్జీ ఉంటుంది. ఇలా మొత్తం 14 కి.మీ దూరానికి రూ.186.2 వసూలు చేస్తారు. అదే ట్రాక్టర్‌కు 40 కిమీ దూరంలో ఇసుక డెలీవరీ చేయాలంటే, రూ.519 మేర చార్జీ ఉండేలా ప్రభుత్వ ఉత్తర్వల్లో స్పష్టం చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |