వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయనకు ఏపీ హైకోర్టుకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
జూన్ 26వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయిగేటు 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు.
ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. ఆ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అప్పట్లో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం ఈ వీడియోల్లో కనిపించింది.
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడినందు వల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైఎస్ఆర్సీపీ వాదన. పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్టును ఈసీకి పింపించారు.
ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫారసు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇదే కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కావాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆయన వేసిన నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల తరఫున ఎన్ అశ్వినీకుమార్, ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు.
తాజాగా- ఆయన బెయిల్ పిటీషన్లపై నేడు కూడా వాదనలు జరిగాయి. పిన్నెల్లి తరఫున వాదించిన అడ్వొకేట్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు.









