మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా.. విశ్వంభర నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని ఆశగా ఎదురుచూసిన అభిమానులను మేకర్స్ నిరాశపరిచారు. టీజర్ రిలీజ్ అవ్వనుందన్న వార్తల్ని డైరెక్టర్ వశిష్ఠ కొట్టిపారేశారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామన్నారు. అయితే.. తాజాగా విశ్వంభర నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో చిరంజీవి త్రిశూలాన్ని చేతపట్టి.. రుద్రనేత్రుడిలా కనిపిస్తున్నారు. యూవీ క్రియోషన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో మరోసారి చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. మీనాక్షి చౌదరి, అషిక రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతేడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. సుమారు రూ.200 కోట్లతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏడాది పూర్తయినా.. చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. జనవరి 10 2025లో సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభరకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 34 ఏళ్ల క్రితం వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మాదిరిగానే విశ్వంభర కూడా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ఇక పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు. కొండపై అభిమానులు చిరంజీవి చూసేందుకు పోటీపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి.. రక్తదానం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో రీ రిలీజ్ థియేటర్లన్నీ అభిమానుల సందడితో హోరెత్తుతున్నాయి.









