ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పైన స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ భరోసా పేరును మార్పు చేసింది. ప్రతీ రైతుకు రూ 20 వేలు ఇస్తామని ఎన్నికల హామీగా పేర్కొంది. ఇప్పుడు రైతు భరోసా అమలు పైన ప్రభుత్వం కీలక అంశాలను వెల్లడించింది. ప్రతీ రైతు భూమిని వెబ్ ల్యాండ్ లో పెడతామని ప్రకటించింది. కైలు రైతు చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంది.
రైతు భరోసాపై ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. ఇప్పుడు కైలు రైతు చట్టంతో పాటుగా రైతు భరోసా అమలు పైన మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేసారు. గత ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని.. ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్లో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతుభరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు పేర్కొన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు.
భీమా పథకం ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణ రావు మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. 2019లో జగన్ చేసిన చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు,ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రైతులకు నష్టం లేకుండా ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్స్యూరెన్స్ అమలు చేస్తామన్నారు. కేంద్రం సాయంతో వచ్చే ఏడాది మంచి ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు.దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్స్యూరెన్స్ అందేలా చేస్తామన్నారు. బెస్ట్ ఇన్స్యూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్స్యూరెన్స్ ప్రయోజన ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.









