జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత నాలుగు రోజుల్లోనే నాలుగు దాడులకు పాల్పడ్డారు. జూన్ 9న రియాసిలో బస్సుపై మొదటి సారి దాడి జరిగింది. తర్వాత మరో మూడు దాడులు చేశారు. కథువా జిల్లా హీరానగర్లోని సైదా సుఖల్ గ్రామంలో ఓ ఇంటిపై దాడి చేశారు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్ మరణించారు. తర్వాత దోడాలని ఛత్తర్ గాలాలోని నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల జాయింట్ చెక్ పోస్టుపై అటాక్ చేశారు. ఇందులో ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని సమీక్ష..
జమ్మూకశ్మీర్లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, జమ్మూ కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్లో భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యాకలాపాలపై వంటి వివరాలను ప్రధాని తెలుసుకున్నారు. ఈ మేరకు ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి తీసుకురావాలని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం.
శాంతిభద్రతలకు విఘాతం
జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నట్లు డీజీపీ ఆర్ఆర్ స్వైన్ ఆరోపించారు. అయితే ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ఐఏ..స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్,స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్ సైతం చేపట్టాయి. కాగా, రియాసీ జిల్లాలో భద్రత పరిస్థితులపై డీజీపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.