UPDATES  

NEWS

 దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్..

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద వాహనాల రాకపోకల కోసం మల్టీ-లేన్ అండర్‌పాస్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి అనుమతులు సాధించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.

 

సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌లో భాగంగా ఈ అండర్‌పాస్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాకుండా, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉత్తర జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “యాక్టివ్‌గా ఉన్న ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద అండర్‌పాస్ నిర్మించడం దేశంలోనే ఇది తొలిసారి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి నిర్మాణం లేదు. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించాం. పనులు కూడా ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి,” అని వివరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఆయన అన్నారు.

 

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని ఢిల్లీ, ముంబైల వలె తీవ్రమైన ట్రాఫిక్, కాలుష్య సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో నగరంలో మౌలిక వసతులను పటిష్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |