హైదరాబాద్.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఇక ఎంతో కాలం కొనసాగదు. దాని కాల వ్యవధి ముగిసిపోయే గడువు దగ్గరికొచ్చింది. కామన్ కేపిటల్గా కొనసాగడానికి ఎంతో సమయం లేదు. జూన్ 2వ తేదీ నాటికి ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుంది.. భాగ్యనగరం.
2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింట్ డే సందర్భంగా ఏపీ- తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. 2024 జూన్ 1వ తేదీ వరకు ఉమ్మడి కేపిటల్గా హైదరాబాద్ కొనసాగుతుందనీ ప్రకటించారు. ఇదే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోనూ పొందుపరిచారు.
ఇంకొద్ది రోజుల్లో దీని గడువు ముగిసిపోనుంది. హైదరాబాద్.. ఇక తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఏపీకి తరలి రావడం మొదలుపెట్టాయి కూడా. హైదరాబాద్ రెడ్ హిల్స్లో గల సింగరేణి భవన్లో కొనసాగుతున్న ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్.. తన కార్యకలాపాలను కర్నూలుకు షిఫ్ట్ చేసింది.
ఈ క్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తెర మీదికి వచ్చారు. తన డిమాండ్ను తెలియజేశారు. మరో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
2014 జూన్ 2వ తేదీన చోటు చేసుకున్న ఏపీ విభజన తరువాత ఈ 10 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయిందని వీవీ లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే- మరో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఏపీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని, దీనికి సంబందించిన ఆర్డినెన్స్ను విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన విజ్ఞప్తి చేశారు.