ఏపీలో ఓట్ల లెక్కింపుకు రంగం సిద్దం అవుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. హోరా హోరీగా ఎన్నికల సమరం జరగటంతో…ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ ఇప్పటికే 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. తామే గెలుస్తామని టీడీపీ కూటమి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక..పోలింగ్ రోజు చోటు చేసుకున్న హింసతో కౌంటింగ్ వేళ పోలీసు శాఖ అప్రమత్తం అయింది. కీలక నిర్ణయాలు తీసుకుంది.
కౌంటింగ్ వేళ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతీ జిల్లాలో కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. సున్నిత ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాల మొహరించాలని నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో సీనియర్ అధికారులను నియమించారు. మొత్తం 26 జిల్లాలకు 56 మంది అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. పల్నాడు ప్రాంతానికి ఎనిమిది మంది సీనియర్ అధికారులను మొహరించారు.
ఏపీలో ఎన్నికల హింస పైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. మరి కొందరి పైన బదిలీ వేటు వేసింది. తాజాగా సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం తరువాత అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నించారు.
పిన్నల్లికి కోర్టులో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది. కానీ, మాచర్లకు రావటానికి లేకుండా పిన్నెల్లి పైన కోర్టు ఆంక్షలు విధించింది. పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాల్లో పోలీసు శాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టింది.