ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓట్లు వేశారు. దీంతో రికార్డు స్ధాయిలో ఏకంగా 82 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పలు చోట్ల ఎన్నికల అక్రమాలు చోటు చేసుకోవడం, హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ కోసం ఎలాంటి విజ్ఞాపనలు రాకపోవడంతో ఈసీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పోలింగ్ ముగిసిన 10 రోజులకు రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్ కావాలంటూ అభ్యర్ధులు ఈసీని కాకుండా హైకోర్టును ఆశ్రయించారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కావాలంటూ వైసీపీ అభ్యర్ధి, మంత్రి అంబటి రాంబాబు, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలంటూ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రీపోలింగ్ ఆదేశాలు ఇవ్వడంపై వాదనలు విన్న తర్వాత తమ నిర్ణయం ప్రకటించింది.
ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రీపోలింగ్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఈసీ కాబట్టి హైకోర్టు ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు అంబటి రాంబాబు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఈసీకి వీరు రీపోలింగ్ కోసం వినతులు ఇవ్వకపోవడం, ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ విధుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో చెవిరెడ్డి, అంబటికి నిరాశ తప్పలేదు.









