కాంగ్రెస్ బోగస్ హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలకు పంగానామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్, లోక్సభ ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు వస్తోందని ధ్వజమెత్తారు.
తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్.. తనని జైల్లో వేస్తామంటున్నారన్నారు. తాను దేనికి భయపడేది లేదన్నారు కేసీఆర్. గులాబీ ఎంపీల్ని గెలిపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ జల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని మండిపడ్డారు. సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుబంధులో దగా చేశారని, రైతుబీమా ఉంటుందో, ఊడుతుందో తెలియదన్నారు కేసీఆర్. మిషన్ భగీరథను కూడా నడపలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని అమలు కావాలంటే, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులు గెలిస్తేనే, బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలుచేపిస్తామన్నారు కేసీఆర్. గులాబీ పార్టీకి బలం ఇస్తే, అది తెలంగాణ ప్రజల బలమవుతుందన్నారు. ఇవాళ 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలిస్తే భూమి, ఆకాశాన్ని ఏకం చేసే పోరాటం మేము చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ ప్రాంతంలోనే ఇరిగేషన్ మంత్రి ఉన్నా ఉపయోగం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రావాళ్లు నీళ్లు తరించుకోపేతే ఎక్కడ పండుకున్నవ్..? నిద్రపోయావా? మరిచిపోయావా? నీళ్లు తరలించుకోపేతో చూసుకుంటు కూర్చుంటావా ? అని కేసీఆర్ ఆ మంత్రిని నిలదీశారు.
1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్ పార్టీనేనన్న కేసీఆర్.. ఇప్పుడు సైతం అడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. గత పదేళ్ల బీఆర్ఎస్పాలనలో రైతులకు ఇబ్బందులు లేవని, తెలంగాణ వచ్చాక కరవు అనేది అంతమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటువేసి బలమిస్తే.. సమస్యలపైన పోరాటం చేస్తామన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.









