రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 89 స్థానాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.
ఈ పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక పిటీషన్లు నేడు విచారణకు వచ్చాయి. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రింట్ అయ్యే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్.. (VVPAT)కు సంబంధించిన పిటీషన్లు అవి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రతినిధులు, ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ వేర్వేరుగా ఈ పిటీషన్లు వేశారు.
ఇప్పుడు కొనసాగుతున్న వీవీప్యాట్ లెక్కింపు ప్రక్రియలో మార్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశగా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలను జారీ చేయాలని వారు అభ్యర్థించారు. ప్రతి ఈవీఎంలో కూడా ర్యాండమ్గా తీసిన అయిదు వీవీప్యాట్ స్లిప్పులకు బదులుగా- అన్నింటినీ లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకంర్ దత్తాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు నోటీసులను జారీ చేసింది. మొత్తం వీవీప్యాట్ల లెక్కింపుపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను సూచించింది. అయిదు ప్రశ్నలను సంధించింది. వీటికి ఈ మధ్యాహ్నం 2 గంటల్లోగా సమాధానాలను ఇవ్వాలని ఆదేశించింది.
1. మైక్రో కంట్రోలర్ను ఈవీఎం కంట్రోల్ యూనిట్లో అమర్చారా? లేక వీవీప్యాట్లల్లో ఇన్స్టాల్ చేశారా? ఈసీ ఎఫ్ఏక్యూలో ఈ మైక్రో కంట్రోలర్ వీవీప్యాట్లల్లో ఇన్స్టాల్ చేసినట్లు సమాధానాలను ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలి?
2. ఈవీఎంలల్లో అమర్చిన ఈ మైక్రో కంట్రోలర్.. వన్ టైమ్ ప్రోగ్రామబుల్ యూనిట్టా? కాదా?
3. ఎన్ని ఎన్నికల గుర్తులను లోడింగ్ చేయగల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి?
4. ఎన్నికల పిటీషన్లను నిల్వ ఉంచడానికి 45 రోజులు, వాటిని దాఖలు చేయడానికి అవసరమైన లిమిటేషన్ పీరియడ్ను 30 రోజులుగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 81 ప్రకారం.. లిమిటేషన్ పీరియడ్ 45 రోజులుగా ఉండాలి. దీనిపై వివరణ ఇవ్వాలి?
5. ఈవీఎంల భద్రతలో భాగంగా దాని కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లను కూడా సీల్ చేయవచ్చా?
ఈ అయిదింటికీ ఈ మధ్యాహ్నం 2 గంటల్లోగా సమాధానాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.









