ఏపీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతోంది. పార్టీల అధినేతలు ప్రచారం ముమ్మరం చేసారు. కూటమిలో కొందరు అభ్యర్దుల మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ సమయంలోనే మేనిఫెస్టోల పైన పార్టీలు తుది కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టో విడుదల ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇక..జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే హామీలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
భారీ అంచనాలు ఏపీలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పైన రాజకీయంగా భారీ అంచనాలు ఉన్నాయి. టీడీపీ గత మహానాడు లో సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతీ సభలో వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ ఎన్నికల మేనిఫెస్టో పైన గతంలో స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తాము అమలు చేసేదే చెబుతామని జగన్ చెప్పుకొచ్చారు. ఈ సారి మేనిఫెస్టోలో కూటమి, వైసీపీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల యుద్దంలో ఇప్పుడు రెండు వైపులా మేనిఫెస్టోల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది.
రుణమాఫీ ఉండేనా వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పైన హామీ ఇస్తారా లేదా అనేది కీలక అంశంగా మారుతోంది. జగన్ తన బస్సు యాత్రలో భాగంగా పలు వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. ఆ సమయంలోనూ అనేక మంది రైతు రుణమాఫీ చేయాలని అభ్యర్దించారు. పార్టీ నేతలు సైతం ఇదే అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. కానీ, జగన్ మాత్రం రుణమాఫీ పైన ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఎన్నికల యుద్దంలో జగన్ రుణమాఫీ చేస్తారా..చేస్తే ఎంత మేర చేస్తారనేది పార్టీలో చర్చ సాగుతోంది. 2014 లో చంద్రబాబు రైతు రుణమాఫీ హామీ ఇచ్చి..అమలు చేయని అంశాన్ని జగన్ ప్రతీ సభలోనూ ప్రస్తావన చేస్తున్నారు. ఇటు కూటమి సైతం రుణమాఫీ పైన హామీ ఇస్తుందనే వాదన వినిపిస్తోంది.
రాజకీయ ఉత్కంఠ 2019 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేసారు. ఈ సారి మహిళలకు ఎలాంటి హామీలు దక్కుతాయనేది చర్చ సాగుతోంది. మహిళలకు ఆర్దిక ప్రయోజనం కలిగేలా హామీలు ఉంటాయని చెబుతున్నారు. అదే విధంగా ప్రస్తుతం అందిస్తున్న రూ 3 వేల పెన్షన్ పెంపు పైనా ప్రకటన ఉండే అవకాశం ఉంది. రైతు భరోసా పెంపు పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కూటమి ఇచ్చే హామీలు..వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు ఓటింగ్ లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో..జగన్ విడదల చేసే మేనిఫెస్టోలో ఇప్పుడు ఎలాంటి హామీలు ఉంటాయనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.









