UPDATES  

NEWS

 అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. “తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

గత ప్రభుత్వ తిరోగమన, ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని పవన్ విమర్శించారు. రైతుల పోరాటాలు, మహిళల ఆవేదన, యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు అసాధారణమైన ధైర్యాన్ని, స్పష్టతను ప్రదర్శించారని కొనియాడారు. స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు అభివృద్ధికి, సుస్థిరతకు పట్టం కట్టారని అన్నారు.

 

పార్లమెంటు ఆమోదంతో రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లోనూ బలమైన, పునరుత్తేజంతో కూడిన విశ్వాసం ఏర్పడిందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి కేవలం రాజధానిగానే కాకుండా, రాష్ట్ర ప్రజల ఆశ, సంకల్పం, సమష్టి కృషికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్, ప్రధాని మోదీ ఆవిష్కరించిన వికసిత భారత్ లక్ష్యాల సాధనలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |