తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ రాజకీయంగా పెను సంచలనం సృష్టించారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ లేదు” అని తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, 2029లో దేశవ్యాప్తంగా ‘జమిలి ఎన్నికలు’ వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సహనంతో కేంద్రాన్ని అడిగి పరిష్కరించుకుంటున్నామని, తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
చిట్చాట్ ముఖ్యాంశాలు:
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరిందని సీఎం వెల్లడించారు. దర్యాప్తు ఆధారంగానే చట్టప్రకారం ముందుకు వెళ్తామని, ఎవరిపైనా కక్ష సాధింపులు లేవని చెప్పారు. “ఇతరుల కాల్స్ వినడం ఒక మానసిక వ్యాధి.. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయుష్షు తగ్గుతుంది” అంటూ మాజీ పాలకులపై సెటైర్లు వేశారు.
-
బుల్లెట్ ట్రైన్ హబ్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బుల్లెట్ రైలు మంజూరైందని, హైదరాబాద్ను ఈ ప్రాజెక్టుకు హబ్గా మారుస్తామని చెప్పారు. దీనికోసం ఫ్యూచర్ సిటీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 600 నుంచి 700 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు.
-
కేటీఆర్, కిషన్ రెడ్డిలపై విమర్శలు: ఫార్ములా-ఇ రేసింగ్ కేసులో స్పష్టంగా మనీ లాండరింగ్ కనిపిస్తున్నా ఈడీ ఎందుకు కేటీఆర్ను అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. కేసీఆర్ కుటుంబంపై ఎందుకు మెతకవైఖరి ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
-
ఎన్టీఆర్కు భారతరత్న: తెలుగు జాతి గర్వించదగ్గ నేత నందమూరి తారక రామారావు గారికి ‘భారతరత్న’ ఇవ్వాలనేది తన వ్యక్తిగత డిమాండ్ అని, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.








