తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అధికారులు ఫిర్యాదులు అందుకోవడం చూస్తుంటాం, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జనగామ మున్సిపాలిటీలోని 23వ వార్డులో తమకు ఓటు వేసేందుకు అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదంటూ కొంతమంది మహిళా ఓటర్లు ఏకంగా రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. సరస్వతి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వీరు, తమ వార్డులో కొందరికి మాత్రమే డబ్బులు ఇచ్చి తమను విస్మరించారని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గత పదేళ్లుగా తమ ఓట్లతోనే గెలుస్తున్నారని, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పక్షపాతంతో కొందరికే డబ్బులు పంపిణీ చేశారని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. “అందరికీ పంచినప్పుడు మాకు ఎందుకు ఇవ్వలేదు?” అంటూ వారు ప్రశ్నించడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకోవడం తప్పని కొందరు నెటిజన్లు హితవు పలుకుతుంటే, మరికొందరు మాత్రం అభ్యర్థుల తీరును విమర్శిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడా ఇలాంటి చిన్న చిన్న విచిత్ర సంఘటనలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఓటు హక్కుపై అవగాహన పెరగాల్సిన సమయంలో, ఇలా డబ్బుల కోసం బహిరంగంగా ఆందోళన చేయడం ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయికి పడిపోతున్నాయో నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








