UPDATES  

NEWS

 తురకపాలెంలో ICAR బృందం పర్యటన..! మిస్టరీ విడినట్టేనా..?

తురకపాలెంలో మిస్టరీ డెత్స్‌కు కారణం మెలియాయిడోసిస్‌ కారణమా? అంటే ఔననే అంటోంది సైంటిస్టుల బృందం. వరుసగా జరుగుతున్న మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు హైదరాబాద్ శ్రీబయోటెక్‌ నుంచి ముగ్గురు సైంటిస్టుల బృందం తురకపాలెం చేరుకున్నారు. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

 

నిన్న మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించిన ICAR బృందం

మరోవైపు ICAR సైంటిస్టులు కూడా గ్రామంలో నీరు, మట్టి నమూనాలు సేకరించారు. ఈ శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. పూర్తి స్థాయి ఫలితాల కోసం 25 రోజుల సమయం పడుతుందని తెలిపారు.

 

10 బృందాలతో 41 పరీక్షల కోసం ఇంటింటి సర్వే..

ఇప్పటి వరకు తురకపాలెంలో మెడికల్ టెస్టులు నిర్వహించారు స్థానిక వైద్య శాఖ అధికారులతో పాటు ఎయిమ్స్ వైద్యుల బృందం. 10బృందాలతో 41 రకరకాల పరీక్షల కోసం ఇంటింటి సర్వే చేశారు. ఈనెల 6 నుంచి 8 వరకు దాదాపు 1500 మంది బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. నిన్న తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం సభ్యులు సాయిల్, నీటి పరీక్షలు నిర్వహించారు.

 

పరీక్షల అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న శాస్త్రవేత్తలు

ఇక తురకపాలెంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారిలో ఒకరికి మెలియాయిడోసిస్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యాధి సోకిన వారికి రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. ఇదే వరుస మరణాలకు కారణమవుతుందనే అనుమానం ఉంది. ఇప్పటి వరకు 62 నమూనాలను సేకరించగా.. అందులో ఐదు ఐసోలేట్స్ గుర్తించినట్లు వెల్లడించారు గుంటూరు డీఎంహెచ్‌వో విజయ లక్ష్మి. ఇక గత రెండు రోజులుగా తురకపాలెంలో నిర్వహించిన విలేజ్ డేటాను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు.

 

తురకపాలెం గ్రామంలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు

 

ఇవాళ కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన మెడికల్ బృందం… తురకపాలెంలో పర్యటించి ప్రతి ఇంటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించనున్నారు. ఇప్పటివరకు అధికారికంగా ముగ్గురికి మాత్రమే మెలియేయిడోసీస్ నిర్ధారణైంది. నిన్న తురకపాలెంలో MLA రామాంజనేయులు పల్లె నిద్ర చేశారు. వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళనలు, మూఢనమ్మకాలు తొలగించేందుకు పల్లె నిద్ర చేశారు.

 

తురకపాలెంలో వరుస మరణాలను హెల్త్ ఎమర్జెన్సీగా భావించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని.. అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని అధికారులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వరుస మరణాలకు ఖచ్చితమైన కారణాలను గుర్తించే పని మాత్రం ఇంకా కొనసాగుతోంది. కానీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్‌తో ప్రస్తుతం దీనిపై ఉరుకులు, పరుగులు మాత్రం మొదలయ్యాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |