UPDATES  

NEWS

 టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్..!

టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ రాక వెనుక ఏం జరిగింది? వైసీపీ ఒత్తిళ్లకు శ్యామలరావు తలొగ్గారా? కేవలం పరిపాలనకు పరిమితమయ్యారా? టీటీడీలో వైసీపీ బ్యాచ్ అలాగే ఉందా? ఇక వారికి చుక్కలేనా? అనిల్ కుమార్ రాక వెనుక అమిత్ షా ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

తిరుమలలో ఈసారైనా ప్రక్షాళన జరుగుతుందా? ఈవోగా శ్యామలరావు వచ్చి ఏడాదిన్నర గడిచింది. అక్కడ తిట్టవేసిన వైసీపీ మద్దతుదారులను కదపలేకపోయారా? అనిల్‌కుమార్ సింఘాల్ అంటే వైసీపీకి ఎందుకంత టెన్షన్? మిగతా ఐఏఎస్‌ల మాదిరిగా ఆయన ఎవరిమాట వినరా? అవుననే అంటున్నారు కొందరు ఉద్యోగులు.

 

టీటీడీలో ఈవో పోస్టుకు చాలామంది ఐఏఎస్ అధికారులు పోటీ పడతారు. జీవితంలో ఒక్కసారైనా ఈవోగా చేస్తే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తుంటారు. ఇప్పుడే కాదు ఉమ్మడి ఏపీ నుంచి టీటీడీలో ఈవో పోస్టుకు డిమాండ్ ఉండేది.. ఉంటుంది కూడా. తాజాగా చంద్రబాబు సర్కార్ దాదాపు డజను మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అందులో టీటీడీ ఈవో కూడా ఒకరు.

 

గతంలో ఈవోగా శ్యామలరావు ఉండేవారు. ఆయన స్థానంలోకి అనిల్‌కుమార్ సింఘాల్ వచ్చారు. అనిల్ టీటీడీ ఈవోగా రావడం రెండోసారి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఈవోగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. టీటీడీలో అడుగడుగునా ఏం జరుగుతుందో ఆయనకు అంతా తెలుసు. ఆయన వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారనే వాదన లేకపోలేదు.

 

గతంలో అమిత్ షా రిక్వెస్టు చేయడంతో అనిల్‌ను టీటీడీ ఈవోగా నియమించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని తొలగించారు. అక్కడి నుంచి కేంద్ర సర్వీసులకు ఆయన వెళ్లిపోయారు. రీసెంట్‌గా ఏపీకి వచ్చిన పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కూటమి సర్కార్ అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవో మరోసారి అవకాశం ఇచ్చింది.

 

అనిల్ కుమార్ రావడంతో ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు-కొత్త ఈవో మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయని అంటున్నారు. టీటీడీలో గడిచిన ఆరేళ్లుగా మకాం వేసిన వైసీపీ మద్దతుదారులకు తొలగించడం ఖాయమనే వాదన మొదలైంది.

 

టీటీడీపై వైసీపీ మునుపటి మాదిరిగా నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం లేదు. ఆ విధంగా చేస్తే నేరుగా అమిత్ షా దృష్టికి ఆయన తీసుకెళ్లడం ఖాయమనే ప్రచారం అక్కడి ఉద్యోగుల్లో మొదలైంది. వైసీపీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు సింఘాల్‌ని ప్రభుత్వం తీసుకొచ్చిందని అంటున్నారు.

 

సింఘాల్ సమయంలో శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు అయ్యింది. దీనివల్ల టీటీడీకి ఆదాయం పెరిగింది కూడా. 2017 మే 6న ఈ బాధ్యతలు చేపట్టిన తీసుకున్న ఆయన, వైసీపీ ప్రభుత్వంలో 2020 అక్టోబరు తొలివారం వరకు పని చేశారు. ఆ తర్వాత ఆయన్ని పక్కన పెట్టింది జగన్ ప్రభుత్వం. వెంటనే ఆయన కేంద్రం సర్వీసులకు వెళ్లిపోయారు.

 

సీఎం చంద్రబాబు ఏరికోరి ఈవో శ్యామలరావును నియమించారు. ఆయన ఆ పదవి చేపట్టి 15 నెలలు అయ్యింది. కనీసం రెండు సంవత్సరాలు ఆయన ఆ పదవిలో ఉంటారని భావించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు ఎదుట ఛైర్మన్ నాయుడు-శ్యామలరావు వాగ్వాదానికి దిగిన విషయం తెల్సిందే.

 

గోశాలలో గోవులు చనిపోయాయని వైసీపీ చేసిన విమర్శలను ఆయన సమర్థవంతంగా తిప్పికొట్ట లేకపోయారు. దీనికితోడు అన్యమత ప్రచారాన్ని అడ్డుకోలేదని అపవాదు ఆయనపై ఉంది. ఛైర్మన్‌తో ఆయన కలిసి పనిచేయకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఆయనపై తొలగించినట్టు చెబుతున్నారు.

 

ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఛైర్మన్‌తో కలిసి ఆలయానికి తాళాలు వేసే కార్యక్రమానికి శ్యామలరావు హాజరుకాలేదు. జరుగుతున్న వివాదాల నేపథ్యంలో శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |