UPDATES  

NEWS

 దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డబుల్ దీపావళి’ హామీ కార్యరూపం దాల్చనుంది. దేశ పరోక్ష పన్నుల విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న పలు జీఎస్టీ శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను కొనసాగించాలనే కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాడే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

 

కొత్త విధానం ఎలా ఉండనుంది?

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త విధానంలో కేవలం 5 శాతం, 18 శాతం అనే రెండు ప్రధాన పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం 12 శాతం శ్లాబులో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం పరిధిలోకి తీసుకురానున్నారు. అదేవిధంగా, అత్యధికంగా 28 శాతం పన్ను ఉన్న శ్లాబులోని 90 శాతం వస్తువులను 18 శాతం శ్లాబులోకి మార్చనున్నారు. దీంతో ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

 

అయితే, పొగాకు, గుట్కా, సిగరెట్లు వంటి హానికరమైన, విలాసవంతమైన వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఈ జాబితాలో కేవలం 5 నుంచి 7 వస్తువులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. వజ్రాలు, విలువైన రాళ్ల వంటి రంగాలపై ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లే కొనసాగుతాయి.

 

సంస్కరణల వెనుక కారణం ఇదే

ప్రస్తుతం జీఎస్టీ ద్వారా వస్తున్న మొత్తం ఆదాయంలో 67 శాతం వాటా 18 శాతం శ్లాబు నుంచే వస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పన్ను రేట్లను త‌గ్గించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని, పెరిగే వినియోగంతో అది భర్తీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

“ఈ ప్రతిపాదన అమలైతే సామాన్యులు, మధ్యతరగతి, రైతులు, మహిళలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అనేక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి” అని జీఎస్టీ నిపుణుడు, ఆర్థికవేత్త వేద్ జైన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునేందుకు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జీఎస్టీ మండలి సమావేశం కానుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే ఈ మండలి ఆమోదం తర్వాతే కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |