UPDATES  

NEWS

 తిరుమలలో దర్శనం, వసతి పేరిట 30 నకిలీ వెబ్ సైట్లు… పోలీసుల కీలక సూచనలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దర్శనం టికెట్లు, వసతి సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తిరుమల పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, కేటుగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, శ్రీవారి సేవల పేరుతో నడుస్తున్న 30కి పైగా నకిలీ వెబ్‌సైట్లను గుర్తించారు. వీటిని సెర్చ్ ఇంజిన్‌ల నుంచి శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 28 మోసపూరిత వెబ్‌సైట్లను విజయవంతంగా తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు.

భక్తులను సులభంగా ఆకర్షించేందుకు సైబర్ నేరగాళ్లు సప్తగిరి గెస్ట్‌హౌస్, నందకం గెస్ట్‌హౌస్, పద్మావతి గెస్ట్‌హౌస్ వంటి పేర్లతో వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి పేర్లతో కనిపించే వెబ్‌సైట్లు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సేవల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org ను మాత్రమే ఆశ్రయించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

అపరిచిత వ్యక్తులు వాట్సాప్ కాల్స్ చేసి దర్శనం కల్పిస్తామని చెప్పినా, క్యూఆర్ కోడ్‌లు పంపి డబ్బులు చెల్లించమని కోరినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఏదైనా వెబ్‌సైట్‌పై అనుమానం కలిగినా లేదా ఎవరైనా మోసపూరితంగా సంప్రదించినా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ, 100 నంబర్‌కు గానీ, టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 18004254141కు గానీ ఫిర్యాదు చేయాలని కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |