UPDATES  

NEWS

 జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం..

పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.

 

పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతికి వైఎస్ జగనే కారణమంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినందున, వారిపై దూకుడుగా వ్యవహరించవద్దని పోలీసు శాఖకు న్యాయమూర్తి సూచించారు.

 

ఈ కేసులో జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. వారంతా కూడా తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటిపై కలిపి న్యాయస్థానం విచారణ జరుపుతోంది.

 

కాగా, జగన్ ప్రచార వాహనం కింద పడటం వల్లే సింగయ్య మృతి చెందాడని చెప్పడానికి స్పష్టమైన వీడియో ఫుటేజ్ అందుబాటులో ఉందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ గతంలో వెల్లడించారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, స్థానికులు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే జగన్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |