UPDATES  

NEWS

 లిక్కర్‌ స్కామ్‌‌లో రోజురోజుకి పెరుగుతున్న అరెస్టులు… చాణక్య అరెస్టు..!

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రూపొందించిన నెట్వర్క్ నిర్వహణలో.. రాజ్ కెసిరెడ్డి ప్రతినిధిగా కీలకపాత్ర పోషించిన.. బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో.. ఎనిమిదో నిందితుడైన చాణక్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందటే చాణక్య దుబాయ్ కి పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతమవటం, సిట్ అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగించటంతో తప్పించుకునే మార్గం లేక రెండు రోజుల కిందట భారత్ తిరిగి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే సిట్ అదుపులోకి తీసుకుని విచారించింది. ముడుపులు ఎలా వసూలు చేశారు? వాటిని రాజ్ కేసిరెడ్డికి ఎలా చేర్చారనేదానిపై సిట్ పలు ప్రశ్నించి వేసి కీలక సమాచారం రాబట్టింది. ఈ కుట్రలో చాణక్య పాత్ర కీలకమేనని తేలటంతో అరెస్టు చేయాలని నిర్ణయించారు.

 

చాణక్య ద్వారా APSBCL ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ కు పంపించేవారు.

 

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు చెల్లించే ముడుపుల ఆధారంగా ఏయే బ్రాండ్లకు ఎక్కువగా ఇండెంట్లు పెట్టాలి? వేటికి తక్కువ ఇండెంట్లు పెట్టాలి? ఏయే బ్రాండ్లకు అసలు ఇండెంట్లే పెట్టొద్దు అనేది రాజ్ కేసిరెడ్డి నిర్ణయించేవారు. దాని ఆధారంగా ముసాయిదా ఇండెంట్ ప్రణాళికను రూపొందించి.. చాణక్య ద్వారా APSBCL ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ కు పంపించేవారు. దాని ఆధారంగానే.. ఎంత ఇండెంట్లు పెట్టాలో డిపో మేనేజర్లను సత్యప్రసాద్ ఆదేశించేవారు. ఎంతమేర ముడుపులు చెల్లించాలనే దానిపై హైదరాబాద్ పరిధిలోని మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలతో చాణక్య అలియాస్ ప్రకాశ్ సంప్రదింపులు జరిపేవారు. మద్యం విక్రయాల డేటాను అనూష అనే అసిస్టెంట్ ద్వారా రాజ్ కేసిరెడ్డి ఎప్పటికప్పుడు తెప్పించుకునేవారు. ఆ సమాచారాన్ని చాణక్యకు చేరవేస్తే.. దాని ఆధారంగా ఆయన ఆ కంపెనీల నుంచి ఐదు రోజులకోసారి ముడుపులు వసూలు చేసేవారు.

 

ఇతర కంపెనీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించి..

 

ముడుపుల వసూళ్ల ప్రక్రియ తొలుత రాజ్ కేసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షించేవారు. తర్వాత ఆయన్ను తప్పించి చాణక్యకు, చాణక్య ఆయన అనుచరులకు అప్పగించారు. దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా డిస్టిలరీలు, సరఫరా దారులతో వీపీఎన్, ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్లతో మాట్లాడేవారు. ముంబయి, ఢిల్లీల్లోని హవాలా నెట్ వర్క్, డొల్ల కంపెనీలు, స్థిరాస్తి సంస్థలు, బంగారం దుకాణాలు, ఇతర కంపెనీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించి.. అక్కడి నుంచి వాటిని తీసుకుని, రాజ్ కేసిరెడ్డికి చేరవేయటంలో చాణక్ప్రయ అలియాస్ ప్రకాశ్ ప్రధాన పాత్ర పోషించాడని తెలుస్తోంది.

 

ఆన్‌లైన్ తీసేసీ ఆఫ్‌లైన్‌కు మార్పు

 

గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేసిన దగ్గర్నుంచి ఎన్నో డౌట్లు తెరపైకి వచ్చాయి. సప్లై, అమ్మకాల విషయంలో ఆన్ లైన్ తీసేసి ఆఫ్ లైన్ లోకి వెళ్లినప్పుడు లోగుట్టు ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోయింది.

 

ఏకంగా రూ. 3200 కోట్లు ముడుపులు మ్యాటర్

 

2019-24 మధ్య ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3200 కోట్లు ముడుపులు వసూల్ చేసినట్లు సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ మొత్తం స్కాంలో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌ లో నాటి సీఎం జగన్‌కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్‌ కేసిరెడ్డి కీలకపాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గత ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి కేసిరెడ్డి ఇదంతా చేశారని గుర్తించింది.

 

ప్రభుత్వానికి ఆదాయం, పార్టీకి ఫండ్ వచ్చేలా ప్లాన్

 

ప్రభుత్వమే వైన్ షాపులు నడిపేలా కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన బాధ్యతను నాటి సీఎం జగన్‌ తనకు అప్పగించారని రాజ్‌ కేసిరెడ్డి తమ విచారణలో చెప్పారని సిట్‌ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావటమే కాక పార్టీ ఫండ్‌ కింద వైసీపీకి భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ లిక్కర్ పాలసీ ఉండేలా చూడాలన్న ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరిగిందంటున్నారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానం తయారీలో జరిగిన కుట్ర, దాని అమలు, ముడుపుల వసూళ్లకు ఫాలో అయిన విధానం, క్యాష్ ను వైట్‌లోకి మార్చేందుకు ఏయే రూపాల్లోకి, ఎక్కడెక్కడికి ఎలా మళ్లించారు? దీని కోసం షెల్ కంపెనీల ఏర్పాటు, హవాలా ట్రాన్సాక్షన్స్ ఎలా నిర్వహించారు? ప్రభుత్వ ఖజానాకు ఎలా నష్టం కలిగించారు? అందులో ఎవరెవరి పాత్ర ఏంటి? వంటి అంశాలన్నింటినీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్.

 

2019 ఆగష్ట్ 16 నుంచి కొత్త లిక్కర్ విధానం

 

ఈ కేసులో పక్కాగా సాక్ష్యాలు సేకరించి ముందుకు వెళ్తోంది సిట్. కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని 2019 ఆగస్ట్ 16న నాటి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, బెవరేజెస్‌ అండ్‌ డిస్టిలరీస్‌ కమిషనర్‌గా కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత అసలు కథ మొదలైనట్లు సిట్ గుర్తించింది. 2019 అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని విజయసాయిరెడ్డి నివాసంలో మిథున్‌రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సుమిత్‌ సహా మరికొందరు ఉన్నారని, నెలకు 50 నుంచి 60 కోట్ల దాకా ముడుపులు వసూలు చేసేందుకు అవకాశముందని లెక్క కట్టి, అందుకు తగ్గట్లు ప్రణాళిక రూపొందించినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి హాజరయ్యారు. వారి నుంచి కీలక సమాచారాన్ని సిట్ రాబట్టింది.

 

2019 దాకా సీటెల్ సాఫ్ట్ వేర్ వాడిన ఎక్సైజ్ శాఖ

 

లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగి ముడుపులు ఎలా చేతులు మారాయన్న డౌట్ రావడానికి ప్రధాన కారణం.. ఆన్ లైన్ విధానం తీసేసి ఆఫ్ లైన్ కు తీసుకురావడం. 2019 దాకా ఎక్సైజ్‌ శాఖ సీటెల్‌ సాఫ్ట్‌వేర్‌ వాడేది. రిటైల్‌ షాపులు, ఏపీఎస్‌బీసీఎల్‌ మెయిన్ ఆఫీస్, డిస్టిలరీలను ఈ సాఫ్ట్‌వేర్‌ లింక్ ఉండేది. ఆటోమేటెడ్‌ రిటైల్‌ షాప్‌ సేల్స్, ఇండెంటింగ్, స్టాక్‌ మెయింటెనెన్స్, స్పేస్‌ మేనేజ్‌మెంట్, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎంఐఎస్‌ డేటా జెనరేషన్, ఆర్డర్‌ ఫర్‌ సప్లై వంటి అంశాల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఉండేది. దాన్ని తొలగించి మాన్యువల్‌గా లిక్కర్ సరఫరా ఆర్డర్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. సేల్స్‌ ఎంట్రీలను సి-టెల్‌ ప్లాట్‌ఫాంలో నమోదు చేసే విధానానికి గుడ్ బై చెప్పి, ఏపీటీ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను తెరపైకి తెచ్చారు. ముడుపులు ఇవ్వటానికి అంగీకరించిన వారిని మాత్రమే ప్రోత్సహించాలన్న ప్లాన్ ను అమలు చేశారంటున్నారు.

 

లిక్కర్ స్కాంలో ఇక అరెస్టులే

 

లిక్కర్ లింకుల చుట్టూ ఏపీలో పొలిటికల్ గా హైటెన్షన్ నెలకొంది. చాలా రోజులుగా దర్యాప్తు చేసిన తర్వాత లేటెస్ట్ గా అరెస్టులకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగిపోయాయి. రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో ఈ లిక్కర్ స్కాంలో మొత్తం 29 మంది ప్రమేయాన్ని ప్రస్తావించారు. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఎ-1గా, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి a-4, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ఎ-5గా పేర్కొంది సిట్. అక్యూస్డ్ లిస్ట్ చూస్తే ఎ2- దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎ3- సత్యప్రసాద్, ఎ4- పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎ5- విజయసాయిరెడ్డి, ఎ6- సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఎ7- ముప్పిడి అవినాష్‌రెడ్డి, ఎ8- బూనేటి చాణక్య, ఎ9- ఈశ్వర కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎ10- ఎస్‌కే సైఫ్‌ అహ్మద్, ఇలా 29 మందిపై అభియోగాలు మోపింది సిట్.

 

ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదన్న టీడీపీ

 

సో ఇప్పటిదాకా జరిగింది ఒకెత్తు అయితే.. ఇకపై జరగబోయేది మరో ఎత్తు అంటున్నారు. నెక్ట్స్ అరెస్టులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని ఆధారాలు దొరికితే, వాటిని ఎస్టాబ్లిష్ చేసి, అందులో ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |