UPDATES  

NEWS

 భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈసీఐ రాజీపడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు.

 

“మహారాష్ట్రలో అర్హులైన వయోజనుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం రెండు గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం భౌతికంగా అసాధ్యం” అని రాహుల్ అన్నారు. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతుందని, ఆ లెక్కన చూసినా అర్థరాత్రి దాకా పోలింగ్ జరగాల్సి ఉంటుందని, కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోగ్రఫీని తాము కోరితే, ఈసీఐ నిరాకరించడమే కాకుండా, అసలు వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు.

 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మరోసారి ‘భారత్ బద్నాం యాత్ర’, ‘ఇండియా అబ్యూస్ యాత్ర’ చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై దాడి చేస్తూ, విదేశాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత ఎన్నికల వ్యవస్థను, ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రశంసించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేశవన్ ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |