తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు ఇసుక రీచ్ ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని.. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం తేల్చి చెప్పారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా ఏర్పాటు చేయాలని ఉన్నత అధికారులకు సూచించారు. ప్రతీ ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రాంతాల వారీగా సమీప ఇసుక రీచ్ ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలని పేర్కొన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని అన్నారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలిని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఆన్ లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను సీఎం ఉన్నత అధికారులకు సూచించారు. ఆఫీస్ టైమింగ్స్ లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలని అని అన్నారు. అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదన్నారు. అక్రమాల విషయంలో ఎంతటి వారు ఉన్నా.. ఎవ్వరిని అయినా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్న చెప్పారు. పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం తెలిపారు.