తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయ్.. జాగ్రత్త అంటూ కార్యకర్తులకు ఆయన సూచించడం గమనార్హం.
కాగా, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశంపై కూడా చర్చించారు. ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు తెలిసింది.
మరోవైపు, కులగణన నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి ఆదివారం అందింది. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఫిబ్రవరి 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా.. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి తొలి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. మెజార్టీ పంచాయతీలను దక్కించుకోవాలని ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది. తెలంగాణలో అత్యధిక పంచాయతీలను గెలుచుకుంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.








