తిరుమలలో వీఐపీ సంస్కృతి కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. టీటీడీ పాలక మండలి వీఐపీ ఫోకస్ వదిలి పెట్టి, సామాన్యులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని స్విమ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రమాదం జరగడానికి కారణాలపై అధికారులతో చర్చించారు.
తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని, వీఐపీ లపై శ్రద్ధ ఎక్కువ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు దర్శనం చేసుకునేందుకు ఎందుకు గంట కొద్దీ సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇకపైనైనా.. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. అలా వీలు కాని పక్షంలో వాళ్లను విశ్రాంత గదుల్లో ఉంచేలా ఉండాలి కానీ.. ఇలా కష్టపెట్టడం ఏంటని అన్నారు.
ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం.. తమ కూటమి ప్రభుత్వం ఈ ప్రమాదానికి బాధ్యత తీసుకుంటుంది అని తెలిపారు. అలాగే.. అధికారులు సైతం కచ్చితంగా బాధ్యత వహించాలని సూచించారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తీవ్ర రద్దీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్న పవన్ కళ్యాణ్.. అలాంటప్పుడు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ముందే ఎందుకు టికెట్లు జారీ చేశారు..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన రాత్రి 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లను 7 గంటలకే ఎందుకు విడుదల చేశారని అనుమానం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు.. వారిని నియంత్రించేందుకు, సరైన సమాచారం అందించేందుకు మైకులు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తొక్కిసలాడ జరిగిన సందర్భంలో విధుల్లో వందలాది మంది పోలీసు సిబ్బంది ఉన్నారని, అప్పుడు వారంతా విధులు నిర్వహిస్తున్నారా.. అంటే ఏదో చేస్తున్నాం అన్నట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సరైన దారిలో నడిపించే అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. అధికారుల తప్పిదం అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పోలీసులు సైతం ఈ తొక్కిసలాటకు కారణమైన వాళ్లల్లో ఒకరని, వారూ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు.
సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా.. విధుల్లో ఏకంగా 11 వందల మంది పోలీసులు ఉన్నారన్నారు. వారిలో 2 ఏసీపీలు, 78 సబ్ ఇన్స్పెక్టర్లు.. వందల మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు ఉన్నారని.. అయినా తొక్కిసలాట ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. తొక్కిసలాటలో 6 గురు చనిపోయారని, 37 మంది గాయపడ్డారని తెలిపారు.
ఈ ప్రమాదంపై ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య నాయుడు, ఇతర అధికారులు బాధ్యత తీసుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు చేసిన పనుల కారణంగా.. ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఇలాంటి తప్పిదాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయని అన్నారు.