ప్రధాని మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. జమిలి పైన జేపీసీ నివేదిక అందే లోగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదానికి వీలుగా కావాల్సిన సంఖ్యా బలం కోసం కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. జమిలి లోగా దక్షిణాదిన ఎన్డీఏ విస్తరణ కోసం మోదీ – షా ద్వయం కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. వీటిల్లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరిన ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది.
ప్రధానితో సమావేశం
సీఎం చంద్రబాబు మాజీ ప్రధాని వాజ్పేయి కు ప్రధాని మోదీతో కలిసి నివాళి అర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రతిపాదించనుంది. ఇందులో ఏపీకి ప్రాధాన్యత దక్కేలా చంద్రబాబు ఈ భేటీలో ప్రధానితో చర్చించనున్నారు. ప్రధాని మోదీ జనవరి 8న ఏపీ పర్యటన దాదాపుగా ఖరారైంది. దీంతో, ఈ పర్యటనతో పాటుగా ఏపీకి నిధుల అంశం పైన చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రులతో భేటీ
ఇక, కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సమయంలో బడ్జెట్లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కుమారస్వామిని చంద్రాబాబు కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నేతల సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకువచ్చిన నూతన సంస్కరణలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎన్డీఏ నేతలు అవుతున్నారు.
చంద్రబాబుకు బాధ్యతలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ నేతలు తొలిసారి భేటీ కానున్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక..జమిలి బిల్లుల ఆమోదానికి వీలుగా అమలు చేయాల్సిన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాదిన ఎన్డీఏ విస్తరణ కోసం ఇప్పటికే ప్రధాని మోదీ – అమిత్ షా ఒక ఫార్ములా సిద్దం చేసారు. అమల్లో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జమిలి ప్రధాన అజెండాగా సాగుతున్న ఎన్డీఏ సమావేశంలో కీలక వ్యూహాలు ఖరారు చేయనున్నారు.









