ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జైలు అధికారులు పేర్కొన్నట్టు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.
జైలులో ఉన్న కారణంగా, ఆగస్టు 15న జరగనున్న పంద్రాగస్టు వేడుకల్లో తన స్థానంలో ఢిల్లీ మంత్రి అతిశీ జెండా ఎగురవేస్తారని తెలియజేస్తూ గవర్నర్ కు లేఖ రాశారు. అయితే, జైలు అధికారులు సీఎం చర్యలను ఖండించారు. ఆయన జైలు నిబంధనలను ఉల్లఘించారంటూ పేర్కొన్నారు. ‘నిబంధనల ప్రకారం, జైలులో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను మాత్రమే లేఖలో పేర్కొనాలి. కానీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. పంద్రాగస్టు వేడుకల గురించి ఆ లేఖలో ప్రస్తావించారు. ఇది పూర్తిగా నిబంధనులకు విరుద్ధం. అందుకే ఆ లేఖ బయటకు వెళ్లలేదు’ అంటూ వారు వెల్లడించారు.
ఈ విషయం ఎలా తెలిసిందంటే..?
కాగా, ఆ లేఖ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరుకోలేదు. అయినా కూడా అందులోని విషయాలు ఎలా లీక్ అయ్యాయన్న అంశంపై చర్చ కొనసాగుతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. జైలు నిబంధనలకు ప్రవర్తించకపోతే చర్యలు తప్పవంటున్నారు అధికారులు.
ఇదిలా ఉంటే.. జైలు నుంచి తనను విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ అందులో కోర్టును రిక్వెస్ట్ చేశారు.









