రాష్ట్రంలో గల 66 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. వారికి సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని పెంచింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే సంతకం చేశారు. అదే సమయంలో ఈ పథకం పేరును మార్చారు.
ఇదివరకు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఈ పేరుతోనే జీఓ విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పింఛన్ పొందనున్నారు. పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానుంది. అంటే- ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3,000 రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపి ఇవ్వనున్నారు.
జులైలో చెల్లించాల్సిన 4,000లకు కొత్తగా ఏప్రిల్, మే, జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను అర్హులైన లబ్దిదారులకు చెల్లించనుంది చంద్రబాబు ప్రభుత్వం. వికలాంగులకు.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 3,000 రూపాయల పింఛన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపయింది. జులై నుంచి 6,000 రూపాయలను తీసుకుంటారు.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ ఛైర్కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెలా వారికి 5,000లను ప్రభుత్వం చెల్లిస్తోండగా.. ఇప్పుడది 15,000 రూపాయలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం 5,000ల నుంచి 10,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం.
సామాజిక భద్రత కింద చెల్లించే పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 66 లక్షలమందికి పైగా లబ్దిదారులు పింఛన్ మొత్తాన్ని అందుకున వారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.