ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో మూడు పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్ అభీష్టం మేరకు డిప్యూటీ సీఎం పదవి పొందారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఇంటికి, పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి ఇబ్బందులు పడవద్దని, తానే త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు తెలిపారన్నారు.
జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని పవన్ చెప్పారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలిసి మాట్లాడాననున్నట్లు జనసేనాని తెలిపారు. తన పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూలు ప్రకటిస్తానని పవన్ పేర్కొన్నారు.
అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసన సభ సమావేశాల్లో పాల్గొంటానని తెలిపారు. అనంతరం తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. జూన్ 20వ తేదీ తరవాత పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలవనున్నట్లు పవన్ చెప్పారు. అనంతరం దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు.