జమ్మూకాశ్మీర్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ-పూంఛ్ రహదారిపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రక్షణ బలగాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో సహాయక బృందాలు చేర్పించాయి. బస్సులో 80 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్మూ-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలోపడిపోయిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా బాధించిందని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రార్థించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.