ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. లక్షన్నర వరకు వసూలు చేసి కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయంతో విశాఖపట్నంకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా చేయోలో ట్రైనింగ్ ఇచ్చారని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.
వివిధ రకాల స్కామ్స్ చేయించి ఒక్క విశాఖపట్నం నుంచే దాదాపు 120 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సీపీ వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన 10 మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరారని సీపీ తెలిపారు.
విశాఖ పోలీసుల చొరవతో స్వదేశానికి పది మంది బాధితులు చేరుకున్నారు. మరికొందరు రాత్రికి విమానంలో వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 58 మంది బాధితులు రానున్నారు. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు అండగా ఉంటామని సీపీ చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కాంబోడియా తీసుకెళ్లారని సీపీ రవిశంకర్ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ. లక్షన్నర తీసుకుని కాంబోడియా పంపించారని వెల్లడించారు.
కాంబోడియాలో ఉన్నవాళ్లని చైనా వారికి అప్పగించి భారత్లో సైబర్ నేరాలకు పాల్పడేలా చేశారని సీపీ రవిశంకర్ పేర్కొన్నారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారని సీపీ తెలిపారు. కొందరు బాధితులను బేస్బాల్ బ్యాట్లతో కొట్టారని తెలిపారు. ఏపీ నుంచి 150కు పైగా బాధితులు 6 నెలలుగా కాంబోడియాలో ఉన్నారని రవిశంకర్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.