ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. మూడు పార్టీల కూటమి వర్సస్ వైసీపీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ మరోసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం అందింది. ఏపీలో ప్రజానాడి పై ఆరా తీసిన ప్రధాని రెండు రోజులు ప్రచారానికి నిర్ణయించారు.
ఏపీకి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ప్రధాని మోదీ తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 30వ తేదీతో పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. 30వ తేదీన హైదరాబాద్ లో వివిధ రంగాల్లో ప్రముఖలతో మోదీ సమావేశం అవుతారు. అదేరోజు అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు.
తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ 3వ తేదీన భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు. ఇదే సమయంలో ఏపీలోనూ ప్రచారం పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు విస్తృత స్థాయి పర్యటనకు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. కాగా, ఆయన మరో విడత ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
సభలు – రోడ్ షోలో ప్రధాని ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు. అనకాపల్లి, విశాఖ, రాజమండ్రి లో ప్రధాని సభలు ఉంటాయని భావిస్తున్నారు. విశాఖలో రోడ్ షో నిర్వహణపైన పార్టీల నేతలు చర్చలు చేస్తున్నారు. అనకాపల్లి, రాజమండ్రిలో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రధాని ప్రచారం పైన బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబు, పవన్ తో చర్చలు చేస్తున్నారు. ప్రధానితో సహా బీజేపీ నుంచి ముఖ్య నేతల పర్యటన పైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన పైన కూటమి నేతలు నిర్ణయానికి వచ్చిన తరువాత అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు.









