తాను బతికున్నంత వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చుకుందామన్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేపు అంబేడ్కర్ జయంతి జరుపుకోనున్నాం. అంబేడ్కర్ ముందుచూపుతోనే మనకు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ ఏర్పాటు జరిగింది. అంబేడ్కర్కు అత్యున్నత గౌరవం ఇవ్వాలని హైదరాబాద్లో 125 ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశాం. రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నాం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలి. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించటం లేదు. ఎన్నో పోరాటాలు, ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించాను. కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడుకున్నట్లు పదేళ్లు రాష్ట్రాన్ని కాపాడాను. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటి అధిగమించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి రైతుల్లో విశ్వాసం, ధీమా కలిగించామన్నారు కేసీఆర్. అన్ని వర్గాల వారికి ప్రత్యేకంగా గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశాం. దళితవాడలు ధనిక వాడలు కావాలని దళితబంధు పథకం చేపట్టాం. 1.30 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు మంజూరు చేసింది. మంజూరు చేసిన డబ్బులను ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసింది. దళితబంధు త్వరగా ఇవ్వకుంటే ఎంపిక చేసిన లబ్ధిదారులతో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తానని కేసీఆర్ సర్కారును హెచ్చరించారు. ప్రజలు మౌనంగా ఉండకుండా పోరాడి సాధించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.