UPDATES  

NEWS

 ఆదాయ సమానత్వంలో భారత్ సత్తా… ప్రపంచంలోనే 4వ స్థానం..!

ఆదాయ సమానత్వం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా నిలుస్తోంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఆదాయ పంపిణీలో అసమానతలను కొలిచే ‘గిని సూచీ’లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించి, ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. అమెరికా, చైనాతో పాటు జీ7, జీ20 కూటమిలోని అన్ని అగ్ర దేశాలను భారత్ వెనక్కి నెట్టడం విశేషం.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, భారత్ ‘గిని సూచీ’ స్కోరు 25.5గా నమోదైంది. ఇదే సమయంలో చైనా (35.7), అమెరికా (41.8) వంటి దేశాలు భారత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. 2011లో 28.8గా ఉన్న ‘గిని’ స్కోరు ఇప్పుడు గణనీయంగా మెరుగుపడటం, దేశ ఆర్థిక ప్రగతి ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందుతున్నాయనడానికి నిదర్శనమని సాంఘిక సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఘనత వెనుక దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న స్థిరమైన విధానాలే ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో స్పష్టం చేసింది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో సుమారు 17.1 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇదే సమయంలో, రోజుకు 2.15 డాలర్ల ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, దేశంలో పేదరికపు రేటు 16.2 శాతం నుంచి కేవలం 2.3 శాతానికి పడిపోయింది.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా 55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆధార్ ద్వారా 142 కోట్ల మందికి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) సేవలు అందించడం వంటి కార్యక్రమాలు ఈ మార్పునకు దోహదపడ్డాయి. డీబీటీ ద్వారా మార్చి 2023 నాటికి రూ.3.48 లక్షల కోట్లు ఆదా అయినట్లు నివేదిక వెల్లడించింది. వీటితో పాటు, ఆయుష్మాన్ భారత్ కింద 41 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించడం వంటి పథకాలు కూడా ఆదాయ సమానత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |