తాడిపత్రి వైసీపీ మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలోకి ప్రవేశించకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కొన్ని షరతులకు లోబడి ఆయన తాడిపత్రి వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
పెద్ద సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్లకూడదని, కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, తాడిపత్రికి వెళుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తాడిపత్రిలో చోటుచేసుకున్న ఘర్షణల కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు, యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం విధిస్తూ నోటీసులు కూడా జారీ చేశారు. పోలీసులు తనను అన్యాయంగా అడ్డుకుంటున్నారని, తన ఇంటిపై జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించింది.
హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావడంతో, ఒకటి రెండు రోజుల్లో జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి, తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో, సున్నితమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న తాడిపత్రిలో మళ్లీ ఉత్కంఠ పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.









