స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశంలో అన్ని మతాలను ఒకేవిధంగా చూడాలన్నారు. కొందరి ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముడిని పూజిస్తూ పెరిగానని.. అలాంటి రాష్ట్రంలో రాముడి విగ్రహాన్ని నరికితే స్పందించకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు.
రంజాన్ మాసంలో మహ్మద్ ప్రవక్తను, అల్లాను ఎవరైనా ఏదైనా అనగలరా? అని బతికి బట్టకట్టగలరా? అని పవన్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను దూషించినట్లుగా యేసును, మేరీ మాతను దూషించగలరా? అని నిలదీశారు. పార్వతీదేవి అమ్మవారిపై కొందరు పిచ్చి కూతలు కూస్తే మనం ఎందుకు భరించాలని ప్రశ్నించారు.
పాతబస్తీలో ఓ నేత 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు? బతుకమ్మను, బతుకమ్మ పాటలను అవహేళన చేసిన ఓల్డ్ సిటీ నాయకుడిని ఎలా ఉపేక్షిస్తారు? అని పవన్ ప్రశ్నించారు. అల్లా, యేసు, అమ్మవారికి ఒకే న్యాయం ఎందుకు లేదన్నారు. హిందువుల రక్తంతో బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు.
దేశ విభజన గురించి తెలుసా?
దేశ విభజన గురించి ఎవరికైనా తెలుసా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అమితాబ్, చిరంజీవి కంటే తాను దేశానికి ఎక్కువ అభిమానని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్లో ఉండిపోయిన లక్షలాది మంది హిందువులను ఊచకోశారని తెలిపారు. పాక్ వెళ్లిన దళిత మంత్రి జోగేంద్రనాథ్ మండల్ కుటుంబాన్ని కూడా చంపేశారని చెప్పారు.
పాకిస్థాన్ ఏర్పడిన సమయంలో 12 శాతానికిపైగా ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడ 1 శాతానికి పడిపోయారని అన్నారు. మనదేశంలో మనం ముస్లింలను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేసి తరిమికొడుతున్నారని చెప్పారు.
తాను ముస్లిం సోదరులను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదని.. సనాతన ధర్మం గొప్పతనమని అన్నారు. ఇతరులను కూడా గౌరవించమని సనాతన ధర్మం చెప్పిందన్నారు. ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న సూడో సెక్యూలరిజం వల్లే మనదేశంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎవరు నేరం చేసినా అన్ని మతాలవారికి ఒకేలా శిక్షలు ఉండాలన్నారు.
గుజరాత్లో మారణహోమం జరిగితే బాధ కలిగించి తాను ఓ పాట రాయించానన్నారు. ఆ తర్వాత ఘటన గురించి పూర్తిగా తెలుసుకుని నిష్పక్షపాతంగా ఉండాలనుకున్నట్లు చెప్పారు. గోద్రా మారణహోమాన్ని ఖండించాలని.. అదే సమయంలో అంతకుముందు ఈ మారణహోమానికి కారణమైన రైలు దహన చర్యను కూడా ఖండించాలన్నారు. రామభజన చేస్తున్న కరసేవకులను రైళ్లో బంధించి సజీవదహనం చేశారని.. మారణహోమానికి కారణమైన ఆ ఘటనను కూడా ఖండించాలన్నారు. మొదటవారిని గుర్తించి శిక్షించాలన్నారు.
దేశం కోసం చనిపోవడానికైనా సిద్ధం: పవన్
నేను భారతదేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. తమిళనాడులో కొందరు నేతలు సంస్కృతం, హిందీని తిడుతున్నారు. అవన్నీ దేశ భాసేలే కదా? తమిళనాడులో హిందీని వద్దంటే ఎలా? తమిళ సినిమాలను హిందీల్ డబ్ చేసి డబ్బులు సంపాదిస్తారు కానీ.. హిందీ వద్దా? అని ప్రశ్నించారు. పనుల కోసం బీహార్, యూపీ కూలీలు మాత్రం కావాలా? కానీ హిందీ వద్దంటారా? అని తమిళనాడు రాజకీయ నేతలపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
హిందువలందరికీ చెబుతున్నా.. ముస్లింలను చూసి నేర్చుకోండి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. తమిళనాడులో సంస్కృతంలో మంత్రాలు చదవద్దంటారా? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ముస్లింలను అరబిక్లో కాకుండా తమిళంలోనే చదవాలని అనగలరా? అని నిలదీశారు. హిందూ మతంలో సంస్కృతంలోనే పూజలు జరుగుతాయన్నారు. వాటిని వదిలేయాలన్నారు.
దేశాన్ని కొందరు ఉత్తరం దక్షిణం అని విడదీయాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎవరికి కోపమొచ్చిన దేశాన్ని ముక్కలు చేయమంటారా? ఇదేమైనా కేక్ ముక్క అనుకుంటున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం తనలాంటి కోట్లాది మంది వస్తారని అన్నారు. దేశాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికీ లేదన్నారు. నేతలు కొంచం ఆలోచించి మాట్లాడాలన్నారు.
రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు కానీ.. దేశాన్ని విచ్చిన్న చేసే ప్రయత్నాలు చేయొద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనుకుంటే చర్చలు జరపాలని సూచించారు. రూపాయిని తమిళంలో రాస్తే.. తెలుగుతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా అదే పనిచేయాలా? అని ప్రశ్నించారు. తాను చదువుకునే సమయంలో తమిళనాడులో వివక్ష అనుభవించానని చెప్పారు. భారతదేశానికి బహు భాష సిద్ధాంతమే మంచిదన్నారు. హిందీని ద్వేషించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎక్కువ భాషలు నేర్చకోవడంలో తప్పేముందని నిలదీశారు.









