కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్షాలో పాల్గొన్నారు ప్రియాంక.
ఉపఎన్నిక నామినేషన్ దాఖలు చేసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి మంగళవారం రాత్రే ప్రియాంక వయనాడ్ చేరుకున్నారు. ముందుగా బుధవారం ఉదయం నాయకల సమక్షంలోనే తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఆ తర్వాత కాల్పేట్టాలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోతో వయనాడ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. యూడీఎఫ్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్ షో అనంతరం కేడబ్ల్యూఏ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ప్రసంగించారు.
‘మొదటిసారి నా కోసం ప్రచారం చేసుకుంటున్నా’
వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవమని ప్రియాంక గాంధీ అన్నారు. ‘తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ, పార్టీ నేతల కోసం నేను 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారాలు చేశా. మీ అందరి మద్దతుతో నా కోసం నేను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. నాకు అవకాశం ఇస్తే వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. కొండచరియలు విరిగిపడినప్పుడు అందరూ ఒకరినొకరు సాయం చేసుకోవడం నేను చూశాను. మీ ధైర్యమే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. మీ కుటుంబంలో భాగం కావడం నాకు గౌరవం’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
వయనాడ్కు ఇద్దరు ఎంపీలు
ప్రియాంక గెలిస్తే వయనాడ్ ప్రజల తరఫున పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరు ఎంపీలు ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. ‘నేను వయనాడ్కు అనధికారిక ఎంపీని. నా సోదరి కుటుంబ కోసం అన్నింటినీ త్యాగం చేసింది. ఇప్పుడు తన శక్తినంతా వయనాడ్ ప్రజల సమస్యలను చూసేందుకు వెచ్చిస్తుంది. మీ అందరిని ఒక కుటుంబలా భావిస్తోంది. మీరు కూడా అలానే చూసుకోవాలని నేను ఆశిస్తున్నా’ అని రాహుల్ గాంధీ అన్నారు.
‘ఐదేళ్లు మీకు అండగా ఉంటా’
ప్రియాంక గాంధీ నామినేషన్పై వయనాడ్ బీజేపీ అభ్యర్తి నవ్య హరిదాస్ స్పందించారు. ‘నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్నారు. ఈ ఒక్క రోజు మాత్రమే ఆ జోష్ ఉంటుంది. ఈ కార్యక్రమం కేవలం ఏడు రోజుల షెడ్యూల్ మాత్రమే. కానీ రానున్న ఐదేళ్లు పాటు వయనాడ్ ప్రజలకు నేను అండగా ఉంటానని వాగ్దానం చేయగలను’ అని నవ్య హరిదాస్ అన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. రాయ్బరేలీ సీటును తన వద్దే ఉంచుకుని, వయనాడ్ ఎంపీగా రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీని యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇక ఈ ఎన్నికలో గెలిస్తే చట్టసభలోకి తొలిసారిగా అడుగుపెడతారు ప్రియాంక గాంధీ. అంతేకాదు ఒకేసారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు చట్టసభల్లో ఉంటారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్సభ సభ్యుడు. ప్రియాంక గెలిస్తే ఆ కుటుంబం నుంచి మూడో వ్యక్తి అవుతారు. నవంబరు 13న వయనాడ్లో పోలింగ్ జరగనుంది.









